భార్యతో సంబంధం పెట్టుకున్నాడని, పనివాడి కళ్లల్లో యాసిడ్ పోయించిన యజమాని!

  • బీహార్ లో కలకలం రేపిన ఘటన
  • ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్న బాధితుడు
  • రెండు వారాల క్రితం యజమాని భార్యతో కలసి పరారీ
  • తిరిగొచ్చిన తరువాత దాడి - చూపు కోల్పోయిన బాధితుడు
తాను పనిలో పెట్టుకున్న వ్యక్తి, తన భార్యతోనే వివాహేతర సంబంధాన్ని నడుపుతూ ఉండటం తట్టుకోలేని ఓ యజమాని అతని కళ్లల్లో యాసిడ్ పోయించిన ఘటన బీహార్ లో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, బెగుసరాయ్ పరిధిలోని పిప్రాచౌక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. సమస్తిపూర్ జిల్లాకు చెందిన బాధితుడు బరౌనీ గ్రామంలో ఓ భూస్వామి వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతని భార్యతో డ్రైవర్ సంబంధాన్ని పెట్టుకున్నాడు.

ఈ నెల 6వ తేదీన వారిద్దరూ కలసి పారిపోగా, అతనిపై కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. ఆపై ఆమె 16వ తేదీన కోర్టు ముందు హాజరై స్టేట్ మెంట్ ఇవ్వగా, భర్తతో కలసి వెళ్లాలని కోర్టు సూచించింది. ఆపై భర్త వద్దకు వచ్చిన తరువాత కూడా, తాను డ్రైవర్ తోనే ఉండాలని భావిస్తున్నట్టు తెలిపింది. ఈ విషయమై వారి కుటుంబంలో గొడవ కూడా జరిగింది.

 ఆపై శనివారం నాడు చిన్న హోటల్ లో ఉన్న బాధితుడిని బయటకు లాక్కొచ్చిన సదరు భూస్వామి బావమరిది, మరికొందరు ఆయన కళ్లల్లో ఓ సిరంజి సాయంతో యాసిడ్ పోశారు. తీవ్రంగా కొట్టారు. ఆపై హనుమాన్ చౌక్ సమీపంలో పడేసి పోయారు. స్థానికులు అతన్ని ఆసుపత్రిలో చేర్పించగా, చూపు పోయినట్టు వైద్యులు తెలిపారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని, మిగతావారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Bihar
Acid
Attack
Eloping

More Telugu News